మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ మలి సభతో ఈ దేశంలో కిసాన్ తుఫాన్ రానున్నదన్న సంకేతాలు వెలువడ్డాయి. కంధార్ లోహా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కదనరంగమై, రాబోయే మార్పునకు సంకేతం లా నిలిచింది. గోదావరి, కృష్ణా పురిటిగడ్డ ఎడారిలా ఎందుకు మారుతున్నది? అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు వంటి పథకం ఎందుకు లేదు? పక్కనున్న తెలంగాణ బాగైనప్పుడు మహారాష్ట్ర ఎం దుకు బాగు కాదు? అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంధించిన ప్రశ్నల పరంపర మహారాష్ట్రీయులను ఆలోచనలో పడేశాయి. వారిలో అంతర్మథనం మొదలైంది. నాందేడ్కు మించి కంధార్ లోహా సభ విజయవంతం కావటం, జనం స్వచ్ఛందంగా తండోపతండాలుగా రావటమే దీనికి నిదర్శనం.
సత్యానికి ఉన్న శక్తి అపారమైనది. దాన్ని ఎవరూ ఏమార్చలేరు. కేసీఆర్ మాటల్లోని సత్యమే మహారాష్ట్ర ప్రజానీకాన్ని ఇంతగా ఆకర్షిస్తున్నది. నీళ్లు, భూమి, బొగ్గు, మానవ వనరులు కావల్సినన్ని ఉన్నా దేశంలోని రైతులకు ఎందుకీ దుస్థితి? అనే సూటి ప్రశ్నను రాజకీయపార్టీల బహిరంగసభల్లో వారు గతంలో ఎన్నడూ విని ఉండరు. అం దుకనే, ‘మీకు ఇక్కడేం పని, తెలంగాణను చూసుకోండి’ అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటివారు కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించినా, సభకు వెళ్లకుండా అడుగడుగునా బీజేపీ అడ్డుకున్నా భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రకంపనలు మొదలయ్యాయనడానికి ఇదే నిదర్శనం. ఎకరా నికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటం బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం. ఫడ్నవీస్ మాటలు బీజేపీలో మొదలైన ఆందోళనను వెల్లడిస్తున్నాయి. ఇం తింతై వటుడింతై అన్నట్లుగా బీఆర్ఎస్ విస్తరిస్తున్నది. పార్టీ పేరు మార్చినప్పుడు పెదవి విరిచినవారు కూడా ఆశ్చర్యపోయేరీతిలో దూసుకువెళ్తున్నది.
రైతులు కేంద్రంగా ఉద్యమాలు నిర్మించటం గతంలో కొంతవరకు జరిగింది తప్ప, ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి రైతులను తీసుకురావటం దేశంలో తొలిసారిగా జరుగుతున్న ప్రయోగం. ఎవరెవరికో, ఏయే పార్టీలకో ఓటు వేసి ఎందుకు గెలిపించాలి? మనమే ఎందుకు చట్టసభల్లోకి వెళ్లకూడదు? మనమే రైతురాజ్యాన్ని ఎందుకు స్థాపించకూడదు? అన్న కేసీఆర్ విశ్లేషణ రైతులనే కాదు, యావన్మంది బుద్ధిజీవులనూ ఆకర్షిస్తున్నది. 140 కోట్ల జనాభాలో సగానికి సగం మంది సాగు మీద ఆధారపడిన దేశం మనది. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయనిదే భారత్ ఆర్థికశక్తిగా ఎదగటం మాట అటుంచి దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల నుంచి విముక్తి కూడా సాధించలేదు. స్వాతంత్య్రానంతరం తొలినాళ్లలో తప్ప ఆ తర్వాత ఏనాడూ వ్యవసాయానికి పాలకులు ప్రాధాన్యం ఇవ్వలేదు. కాబట్టే దేశ రైతులు నేటికీ సంక్షోభం లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. 75 ఏండ్లుగా భారత్ ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే ఉండిపోయింది కూడా అందుకే. దీనికి పరిష్కారం రైతు రాజ్యమే. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నేడు నినాదమే కావచ్చు.. రానున్న రోజుల్లో అది భారతీయుల స్ఫూర్తి మంత్రం.