– 113 స్పా సెంటర్ల తనిఖీ, 46 కేసుల నమోదు
హైదరాబాద్, జూన్ 05 : అక్రమ కార్యకలాపాలు, అనధికారిక క్రాస్ మసాజ్ సేవలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సహకారంతో కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్లపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 113 స్పా సెంటర్లను పరిశీలించగా నిబంధనలను ఉల్లంఘించిన 46 స్పా సెంటర్ల యజమానులు, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
– అవసరమైన అనుమతులు, ఆమోదాలు లేకుండానే స్పా సెంటర్ల నిర్వహణ
– పారదర్శక గాజు తలుపులు లేకుండా మూసివేసిన చీకటి గదుల ఏర్పాటు
– ఖాతాదారుల ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలను సేకరించకపోవడం
– వ్యాపార పేర్లు, సైన్బోర్డులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం
– ఖాతాదారుల రిజిస్టర్లు, ఉద్యోగుల వివరాలు, థెరపిస్టుల సమాచారం, హాజరు రికార్డులు వంటి తప్పనిసరి పత్రాలను నిర్వహించకపోవడం.
– ఎల్బీ నగర్ జోన్లో 47 స్పా సెంటర్ల తనిఖీ, 17 కేసులు.
– ఉప్పల్ జోన్లో 30 స్పా సెంటర్ల తనిఖీ, 11 కేసులు.
– మల్కాజిగిరి డివిజన్-1లో 17 స్పా సెంటర్ల తనిఖీ, 7 కేసులు.
– మల్కాజిగిరి డివిజన్-2 (కంటోన్మెంట్)లో 19 స్పా సెంటర్ల తనిఖీ, 11 కేసులు నమోదయ్యాయి.
నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), అనైతిక రవాణా నిరోధక చట్టం (ITPA)తో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
స్పా సెంటర్ల నిర్వహణ కోసం భవనాలను అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలు, వారి కార్యకలాపాలను పూర్తిగా పరిశీలించాలని మల్కాజిగిరి పోలీసులు సూచించారు. అక్రమ కార్యకలాపాలకు సహకరించే ఆస్తుల యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా లేదా అక్రమంగా నడుస్తున్న స్పా సెంటర్ల సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్ లేదా కమిషనరేట్ హెల్ప్లైన్కు అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి పర్యవేక్షణలో, డీసీపీ (రోడ్ సేఫ్టీ) & ఎస్ఓటీ ఇన్చార్జ్ కె.మనోహర్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు.