కౌలాలంపూర్: బీఆర్ఎస్ మలేషియా శాఖ , మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ( Telangana Formation Day ) ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా ( Mahesh Bigala ) కౌలాలంపూర్ ( Kualalumpur ) నగరంలోని ఎంఈసీసీ ( MECC ) కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే మలేషియాకు చేరుకోగా, అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు, బీఆర్ఎస్ శ్రేణులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ రాకతో మలేషియాలోని తెలంగాణ సమాజంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

గత సంవత్సరం డల్లాస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించిన ట్లే, అదే ఉత్సాహంతో ఈసారి మలేషియాలో కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహేశ్ బిగాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులు కలిసి సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మలేషియాలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

1955 నుంచి మలేషియాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలతో పాటు, తెలంగాణ ఉద్యమానికి ప్రారంభం నుంచే మద్దతు తెలిపిన పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనను న్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్ నాయకత్వానికి మలేషియా ప్రవాసుల నుంచి విశేష మద్దతు లభించిందని, ఇప్పుడు కేటీఆర్ను ప్రత్యక్షంగా కలుసుకుని ఆయన ప్రసంగాన్ని వినేందుకు ప్రవాస తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.
సింగాపూర్ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్ఆర్ఐ నాయకులు, తెలుగు సమాజ సభ్యులు హాజరవుతుండగా, ఆస్ట్రేలియా సహా పరిసర దేశాల నుంచి కూడా తెలంగాణ వాసులు భారీగా తరలివస్తున్నారని వివరించారు.