ప్రజాస్వామ్యానికి ఓటు మూలాధారం. ప్రజల అభిమతం తెలిపే పవిత్రమైన పత్రం బ్యాలెట్. ఆ పత్రం అపవిత్రమైపోయింది. స్వేచ్ఛ, పారదర్శకత గాలికెగిరిపోయాయి. బ్యాలెట్లో నిక్షిప్తమైన తీర్పు తారుమారైంది. నిష్పాక్షిక దృష్టితో ఎన్నికలను పర్యవేక్షించాల్సిన ప్రిసైడింగ్ అధికారి స్వయంగా అక్రమాలకు పాల్పడటం, ఎన్నిక ఫలితాలను తిమ్మిని బమ్మిని చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సర్వోన్నత న్యాయస్థానికి వెళ్తే గానీ దారిమళ్లింపునకు గురైన ఓటుకు ఊరట లభించలేదు. భారతీయ ఎన్నికల వ్యవస్థకు పెను మచ్చలాంటి ఈ ఘటన పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని నగరమైన చండీగఢ్లో జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఎన్నికల నిర్వహణ వ్యవస్థ లొసుగులపైకి దృష్టి మళ్లిస్తున్నాయి.
చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రిసైడింగ్ అధికారి కొన్ని బ్యాలెట్లను కొట్టివేయడం, వాటిని అనర్హమైనవిగా ప్రకటించడంపై దుమారం చెలరేగిన విషయం విదితమే. ఆప్, కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్ పదవికి ఎన్నికైనట్టు ప్రకటించడం వివాదానికి దారితీసింది. అందుకు ఎనిమిది ఓట్లను చెల్లనివిగా ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి అనిల్ మసీహ్పై సుప్రీంకోర్టు మండిపడింది. బీజేపీకి చెందిన నామినేటెడ్ సభ్యుడైన మసీహ్ ఆప్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు చెందిన ఎనిమిది ఓట్లను కొట్టివేయడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సదరు వీడియోను వీక్షించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ‘ఇది దుర్భర ఉదంతం’ అని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని స్వయంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా అక్రమానికి పాల్పడిన ప్రిసైడింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, తదుపరి విచారణ రోజు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించడం ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తున్నదనడానికి నిదర్శనం.
కేవలం 35 మంది ఎన్నికైన కౌన్సిలర్లు, ఒక పార్లమెంట్ సభ్యుడు పాల్గొనే ఎన్నికను చేతులెత్తడం ద్వారా కాకుండా రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించడమే పలు సందేహాలకు తావిచ్చింది. బహుశా క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమో అని బీజేపీ ఆశించి ఉండవచ్చు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. ఓట్లు పక్కాగా పోలవడంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ మసీహ్ తన చేతివాటాన్ని చూపించారు. పదేపదే సీసీటీవీ కెమెరాల వైపు చూస్తూ బ్యాలెట్లపై ఆయన గీతలు గీశారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ‘మేం అంతా గమనిస్తున్నామని గుర్తుంచుకోండి’ అని తాఖీదు ఇవ్వడం ఈ వ్యవహారంలో హైలైట్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నదని, ముఖ్యంగా ఓటింగ్కు ఉపయోగించే ఈవీఎం యంత్రాలను తారుమారు చేస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయనేది అలా ఉంచితే, చండీగఢ్లో ఎన్నికల అక్రమానికి ఒడిగట్టింది కేంద్రంలోని పాలక బీజేపీకి చెందిన నేత కావడం ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నది. రెండు విడతల అధికారాన్ని చేజిక్కించుకొని, మూడో విడతకు అంగలు వేస్తున్న పార్టీకి చండీగఢ్ తరహా ఎన్నికల అక్రమాలు శోభించవు. కొన్ని ప్రత్యేకమైన నియమ, నిబంధనలకు లోబడి ఆడాల్సిన ప్రజాస్వామ్య క్రీడలో తొండి జరగడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఓటు అపహాస్యానికి, అపనమ్మకానికి గురికావడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.