వ్యవసాయానికి ముందుచూపు చాలా అవసరం. దూపయినప్పుడే బాయి తవ్వుకుంటామంటే సాగు సాగదు. దుక్కి చేసుకోవాలి, నీళ్లు చూసుకోవాలి, విత్తనాలు, పురుగుమందులు తెచ్చిపెట్టుకోవాలి. వీటికి తోడు ప్రకృతి కూడా సహకరించాలి. ఇలా అన్నీ అదనులో అమరితేనే వ్యవసాయం సాగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ క్రమం తప్పింది. అందుకే వ్యవసాయం ఇప్పుడు ఎవరూ లేని అనాథ అయ్యింది. అటు కేంద్రం పట్టించుకోదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో తెలియదు. పాత రుణాలు మాఫీ కాలేదు. కొత్త రుణాలు రావడం లేదు. ఈలోగా బకాయిల కోసం రుణదాతలు రైతన్నల వెంబడి పడుతున్నారు. రైతుబంధు పథకం నత్తనడకన సాగుతున్నది.
రోజుకో సాకుతో సర్కారు కాలం గడుపుతున్నది. ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర మాత్రమే నిధులు విడుదలయ్యాయి. కొత్తకొత్త కొర్రీల కారణంగా మిగతావి ఎప్పుడు పడతాయో తెలియడం లేదు. కొత్తగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదో అదనుగా మారింది. అటుచూస్తే నీళ్ల పరిస్థితి ఆగమాగమైపోయింది. గలగలలాడిన కాలువలు, చెరువులు మూగబోయాయి. నిండు కుండల్లాంటి జలాశయాలు బోసిపోతున్నాయి. నిన్నటిదాకా గంతులు వేసిన గంగమ్మ దాగుడు మూతలాడుతున్నది. దాంతో నీటి కోసం అన్నదాతలు యాతన పడుతున్నారు. పొలాల్లో ట్యాంకర్లు, బోర్ల సందడి కనిపిస్తున్నది. చెరువులు, కాలువల పూడికతీతకు క్రేన్లు తిరుగుతున్నాయి. అటు 24 గంటల కరెంటు కూడా అందడం లేదు. రాత్రిపూట బాయిల కాడికి పరుగులు మళ్లీ మొదలయ్యాయి.
నీళ్లు లేక, కరెంటు లేక పొలాలు ఎండుతుంటే రైతుల గుండెలు మండుతున్నాయి. పండిన ఆ కాస్త పంటను మార్కెట్కు తీసుకుపోతే సరైన ధర రావడం లేదు. ఎప్పుడూ డిమాండ్ మీద ఉండే మిర్చికే మద్దతు ధర రావడం లేదు. పోనీ ధర వచ్చేదాకా నిల్వ చేసుకుందామంటే సౌకర్యాలు సరిపోవడం లేదు. రాష్ట్రంలో ఎటుచూసినా సమస్యలే. తీరే మార్గం కనిపించడం లేదు. వాటిని తీర్చే నాయకుడూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానరావడం లేదు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత పగ్గాలు చేపట్టిన ఉద్యమ సారథి కేసీఆర్ వ్యవసాయానికే పెద్దపీట వేశారు. ‘మిషన్ కాకతీయ’ అనే బృహత్తరమైన పథకం కింద సుమారు 47 వేల చెరువులను పునరుద్ధరించారు. ప్రాజెక్టులు పూర్తిచేసి నీటి నిల్వకు మార్గం సుగమం చేశారు. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతలతో గోదావరిని ఎత్తులకు తరలించి తెలంగాణకు జలాభిషేకం చేశారు. సీజన్కు ముందే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచారు. రైతుబంధుతో పెట్టుబడి సాయం అందించారు. రైతు బీమాతో కుటుంబాలకు ధీమా కల్పించారు. పండిన ధాన్యం చివరి గింజ వరకు కొంటూ డబ్బు సకాలంలో ఖాతాల్లో వేయించారు.
కానీ, ఇప్పుడు రాష్ట్రంలో సాగు సడుగులిరిగాయి. మొన్నటిదాకా దర్జాగా, కాలుమీద కాలేసుకొని బతికిన రైతుల బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం గుదిబండగా మారి రైతుల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతున్నది. పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనం. రైతులను ఆదుకోవాల్సిన కాంగ్రెస్ సర్కారు సాకులు వెతుకుతున్నది. ఆరునెలల కిందటి వరకు పండుగలా సాగిన వ్యవసాయం ఇప్పుడు అష్టకష్టాలపాలు కావడం విషాదం. కడుపులో పెట్టుకుని కాపాడిన కేసీఆర్ సర్కారు స్థానంలో కాళ్లల్ల కట్టెలు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే ప్రస్తుత దుస్థితికి కారణం అనడంలో ఏ మాత్రం సంశయం అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ కక్షలు మాని రైతాంగానికి ఉపశమనం కలిగించే దిశగా అడుగులు వేయడం శ్రేయస్కరం.