రుద్రదేవ మహారాజుగా కీర్తి వహించిన రాణి రుద్రమదేవి తన అసమాన ధైర్య సాహసాలతో, వీరోచిత పోరాటాలతో సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని 30 ఏండ్లు పరిపాలించి తెలుగువారి శౌర్య ప్రతాపాలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంతకుపూర్వం ఢిల్లీ సుల్తానులలో రజియా సుల్తానా ఢిల్లీని పరిపాలించింది. అదేవిధంగా తండ్రి అప్పగించిన బాధ్యతను పురుషరూపంలో స్వీకరించి, శత్రురాజులను మట్టి కరిపించిన వీరనారి రుద్రమదేవి.
గణపతిదేవుడు పుత్రసంతానం లేని కారణంగా కాకతీయ సామ్రాజ్యం దాయాదుల, శత్రువుల బారిన పడకుండా తన కూతురునే కుమారునిగా పెంచి కత్తిసాములు, యుద్ధవిద్యలు పరిపాలనలో మెలకువలు నేర్పించినాడు. వంశపారంపర్యంగా ఒకేసారి పదవి కట్టబెట్టలేదు గణపతిదేవుడు. సాధారణ సైనికుడిగా, మండలాధిపతిగా నియమించి, సరియైన సమ యం వచ్చినప్పుడే పట్టాభిషేకం జరిపించాడు.
శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా, రాయగజకేసరిగా, పట్టోద్దతిని పొందినదిగా పేర్కొనబడింది. శాసనాల్లో ఆమె చేసిన యుద్ధాలు, ఓడించిన రాజులు, సాధించిన విజయాల గురించిన అనేక అంశాలు పేర్కొనబడ్డాయి. సామ్రాజ్యంలో రుద్రమదేవి ఒక మహిళగా, తల్లిగా, సామ్రాజ్యాధినేతగా, పరిపాలనా దక్షురాలిగా, శాసనాధికారిగా సర్వ రంగాల్లో తన నైపుణ్యాన్ని చూపి సమకాలీన సమాజంలో ఆదర్శ మహిళగా, తరువాతి తరాల వారికి మార్గదర్శకురాలుగా చరిత్రలో నిలిచిపోయింది.
ఏ రాజు రాజ్య పరిపాలన చేసినా చరిత్రలో ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు రాజ్యానికి వచ్చాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఎప్పుడు మరణించాడు అనే చారిత్రక దృక్కోణం సాధారణంగా చరిత్రకారులకు ఉంటుంది. ఆ దృష్టితోనే రుద్రమకు సంబంధించిన అన్ని అంశాలతో పాటు మరణించిన కాలానికి సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు వెలువరించారు. రాణి రుద్రమ వీరోచితంగా పోరాడుతూ యుద్ధరంగంలో మరణించినట్లు కొంతమంది భావించగా, ఆమెను వెన్నుపోటు పొడిచి యుద్ధ శిబిరంలో మోసపూరితంగా చంపినట్లు మరికొంతమంది భావన. క్రీ.శ. 1296 వరకు ఈమె జీవించి ఉన్నట్లు కొంతమంది చెప్తారు. కానీ నల్లగొండ జిల్లా నకిరేకల్లు మండలం చందుపట్ల గ్రామంలో లభించిన ఒక శాసనం కాకతీయ చరిత్రకు, ముఖ్యంగా రుద్రమదేవికి సంబంధించి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
ఈ శాసనం శ.సం. 1211 విరోధి సంవత్సరం, మార్గశిర శుద్ధ ద్వాదశినాడు రుద్రమదేవి సైన్యాధ్యక్షుడు మల్లికార్జున నాయుడు భృత్యుడైన పువుల ముమ్మడి అనే అతడు రుద్రమదేవి, మల్లికార్జున నాయుడుల శివలోక ప్రాప్తి కొరకు చందుపట్ల సోమనాథ దేవునికి ఆ గ్రామంలో ఉన్న రాసముద్రం వెనక కొంత భూమిని దానమిచ్చి శాసనం వేయించినాడు. ఒక సామ్రాజ్యానికి అధినేత, సర్వ సైన్యాధ్యక్షుడు ఒకే సమయంలో మరణించిన విషయం ఇతర మండలాధిపతులు, సామంతులు పేర్కొనలేదు. కానీ ఒక సామాన్య భృత్యుడు రుద్రమపై ఉన్న అభిమానాన్ని ప్రకటించుకుంటూ వారి పుణ్యలోక ప్రాప్తికి తనకు తోచిన దానం చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం.
డాక్టర్ భిన్నూరి మనోహరి
93479 71177