ఇంటిమీద పెంకులనే ఏడాదికోసారి సర్దుతాం. వ్యవసాయ బావి కూరుకుపోతున్నకొద్దీ పూడిక తీస్తూనే ఉంటాం. ఇంట్లో ఉన్న బోరు మోటరు పాడైతే మరమ్మతులు చేస్తూనే ఉంటాం. అంతెందుకు మనిషి కూడా రోగాల బారిన పడితే ఆ రోగం నయమయ్యేదాన్క దవాఖానల సుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇట్లా మనిషైనా, వస్తువైనా మరమ్మతులు చేయాల్సిందే. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని గాలికొదిలేసి ప్రజలను నట్టేట ముంచుతున్నది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల మీద ప్రభుత్వానికి ఎందుకింత కినుక? ‘అమ్మ పెట్టదు, అడుక్కు తిననీయదు’ అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ వ్యవహారం.
తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ గత ప్రభుత్వం చేసిన అన్నీ పనులను దండుగ అని విష ప్రచారం చేస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి దేశాన్ని ఎక్కువకాలం పాలించింది కాంగ్రెస్ పార్టీనే. అలాంటి కాంగ్రెస్కు పథకాలు, పనులు, నిర్వహణ, మరమ్మతులు.. ఇలా అన్ని కలిస్తేనే పాలన అన్న చిన్న విషయం తెలియకపోవడం విడ్డూరం. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే.. ‘ఎత్తుకుంటే చంకకురాడు, దింపితే నడువడు’ అన్న చందంగా ఉన్నది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మెరుగైన పాలన అందివ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల బాగోగులను గాలికొదిలేసి చోద్యం చూస్తుండటం గర్హనీయం.
అయితే ప్రభుత్వానికి తెలియాలి, లేకుంటే ప్రతిపక్షాలు చెప్తే వినాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండింటిలో ఒక్కటి కూడా చేయడం లేదు. కొన్ని పార్టీలు పాలకపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రగతికి అడ్డం పడుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటిదే. తెలంగాణ ప్రజలు అభిమానధనులే కాదు, గొప్ప ఆలోచనాపరులు కూడా. మన క్షేమ కాంక్షులెవరు? మాయమాటలు చెప్పేదెవరు? అనేది వాళ్లకు తెలుసు. తమ ఓటును సద్వినియోగపర్చుకుంటారు. రేపు జరుగబోయేది కూడా అదే.
భోజన్నగారి అనసూయ