భూమిని చదును చేస్తుండగా లభ్యం
18 తులాల 7 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి, ఇతర సామగ్రి
స్వాధీనం చేసుకున్న అధికారులు
వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ ఏడీ
జనగామ రూరల్, ఏప్రిల్ 8 : జనగామ మండలం పెంబర్తి గ్రామంలో జేసీబీతో భూమిని చదును చేస్తున్న క్రమంలో గురువారం లంకెబిందె దొరికింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని జాతీయ రహదారికి సమీపంలో మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కీసర మండలం భోగారానికి చెందిన మెట్టు నర్సింహయాదవ్, దుర్గాప్రసాద్, నాగరాజు నెలక్రితం ఓ వ్యక్తి వద్ద 11 ఎకరాల ఆరు గుంటల భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిని ప్లాట్లుగా తయారు చేయడానికి బుధవారం ఎక్స్కవేటర్తో చదును చేయిస్తున్నారు. గుండ్లు ఉండడంతో వాటిని తీసివేస్తున్న క్రమంలో ఏదో గుండ్రంగా తాకడంతో ఎక్స్కవేటర్ డ్రైవర్ దానిని పక్కకు నెట్టాడు. ఇంతలో భూమి యాజమాని రేపు చేద్దామనడంతో పనులు ముగించారు. గురువారం ముళ్ల చెట్లను, గుండ్లను తొలగిస్తున్న క్రమంలో ఓ లంకెబిందె కనబడింది. డ్రైవర్ భూమి యాజమానికి తెలుపడంతో అక్కడకు వచ్చి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు.
సర్పంచ్ ఆంజనేయులు, కొందరు గ్రామ పెద్దలు అక్కడికి వచ్చి చూసి బిందెను కదిలించడంతో అందులో నగలు కనబడ్డాయి. వెంటనే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు విషయాన్ని తెలిపారు. వారు అక్కడికి వచ్చి గ్రామానికి చెందిన గోల్డ్స్మిత్ను పిలిచి అన్ని వస్తువులను లెక్కించారు. 18తులాల 7గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి కిలో 720 గ్రాములు, పగడాలు 7 గ్రాములు, రాగిపాత్ర కిలో 200 గ్రాములు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఏసీపీ వినోద్ కుమార్, తహసీల్దార్ రవీందర్ సందర్శించారు. వాటిని స్వాధీనం చేసుకోని పంచనామా చేశారు. ఈ బంగారం జిల్లా కలెక్టర్కు అప్పగిస్తామని తహసీల్దార్ తెలిపారు. పురావస్తు శాఖ అధికారులకు విషయాన్ని తెలిపామన్నారు. లంకెబిందె దొరికిందనే వార్త తెలువడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం.. ఓపాడ్స్ను ప్రారంభించిన తెలంగాణ బాలిక