బంగ్లాదేశ్ విముక్తిపోరులో
ఇరుదేశాల వాళ్ల రక్తం చిందింది
ఎన్ని ఒత్తిళ్లున్నా ఈ బంధం విడిపోదు
బంగ్లాదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ
ఢాకా, మార్చి 26: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం రక్త సంబంధం అని ప్రధాని మోదీ అన్నారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఈ బంధం విడిపోదని చెప్పారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా జరిగిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో బంగ్లాదేశీయుల రక్తంతోపాటు, భారత సైనికుల రక్తం కలిసి నేలపై పారిందని గుర్తుచేశారు. రెండు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్ వెళ్లిన మోదీ శుక్రవారం ఆ దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవం, బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ శతజయంతి ఉత్సవాలకు గౌరవ అతిథిగా హాజరై మాట్లాడారు. బంగబంధుగా పేరున్న షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వాన్ని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. ముజిబుర్ను గాంధీ శాంతి బహుమతితో గౌరవించడం భారత్కు గర్వకారణమన్నారు. ఈ బహుమతిని ముజిబుర్ రెహమాన్ కూతుర్లు షేక్ హసీనా (ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని), షేక్ రిహన్నాలకు ప్రదానం చేశారు. ముజిబుర్ పేరిట ప్రఖ్యాతిగాంచిన ‘ముజిబ్ జాకెట్’ (షర్టుపైన వేసుకొనే చేతులు లేని అరకోటు)ను ధరించి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు మోదీ బంగ్లాదేశ్ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. విముక్తి పోరాటంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. కాగా, కరోనా వ్యాప్తి తర్వాత ప్రధాని తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. బంగ్లాదేశ్ స్వాతంత్య్రదిన స్వర్ణోత్సవాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
పారిశ్రామికవేత్తలకు స్వాగతం
భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలకు 50 ఏండ్లు గడిచిన సందర్భంగా బంగ్లాదేశ్కు చెందిన 50 మంది పారిశ్రామికవేత్తలను మోదీ ఇండియాకు ఆహ్వానించారు. వారిని స్టార్టప్ ఇండియాలో భాగస్వాములు కావాలని కోరారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రతిభావంతులకు ఇచ్చే స్వర్ణజయంతి ఫెల్లోషిప్ను బంగ్లాదేశ్ యువతకు కూడా ఇస్తామని పేర్కొన్నారు.
మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు
బంగ్లాదేశ్లో మోదీ పర్యటనను నిరసిస్తూ ఇస్లామిక్ సంస్థలు దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రదర్శనలు నిర్వహించాయి. కొన్ని చోట్ల ఆందోళనలు హింసకు దారితీశాయి. చిట్టగాంగ్లో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరుపాల్సి వచ్చింది. దీంతో నలుగురు నిరసనకారులు చనిపోయారు. ఢాకాలో 50మందికి పైగా గాయపడ్డారు.
బంగ్లా విముక్తి పోరు సంఘీభావ సత్యాగ్రహంలో పాల్గొన్నా
1971నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి అప్పటి యావత్ భారత ప్రజానీకం మద్దతిచ్చిందని మోదీ పేర్కొన్నారు. అప్పుడు తనకు 20-22 ఏండ్ల వయసు ఉంటుందని, బంగ్లా విముక్తిపోరుకు మద్దతుగా జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నానని గుర్తు చేసుకొన్నారు. రాబోయే 25 ఏండ్లు భారత్, బంగ్లాదేశ్కు చాలా కీలకమన్నారు. ‘మనది ఉమ్మడి సంస్కృతి. ఉమ్మడి వృద్ధి. లక్ష్యాలు, అవకాశాలు కూడా ఉమ్మడివే. ఇరుదేశాలకు పొంచి ఉన్న ముప్పు కూడా ఒకటే. అదే ఉగ్రవాదం’ అని బంగ్లాదేశ్ను ఉద్దేశించి మోదీ పేర్కొన్నారు.
దక్షిణాసియాకు పెద్దన్నలా ఉండాలి
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
దక్షిణాసియాలో రాజకీయ స్థిరత్వానికి, ఆర్థిక వృద్ధికి భారత్ నేతృత్వం వహించాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోరారు. ‘శక్తివంతమైన దక్షిణాసియాను నిర్మించడంలో భారత్ మార్గదర్శక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్కు కరోనా టీకాలు సరఫరా చేయడంపై ఆమె మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ పుట్టుకతో భారత్కు విడదీయరాని సంబంధం ఉందన్నారు.