రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం సహజం. వీటిని ముద్దుగా పల్టీలు అని పిలుస్తుంటారు. ఇలాంటి పల్టీలు వేయడంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ రికార్డును ఎవరూ అధిగమించలేరేమో. తాజాగా ఆయన ‘ఇండియా’ కూటమితో తెగదెంపులు చేసుకొని ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. తన సీఎం కుర్చీని పదిలం చేసుకున్నారు. 2015 తర్వాత ఇది ఆరో పల్టీ తనకు. 2004 నుంచి మొత్తం తొమ్మిదిసార్లు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని విజయం సాధించారు. 17 నెలల క్రితం బీజేపీని పక్కనపెట్టి ఆర్జేడీ, కాంగ్రెస్తో జతకట్టారు. ఇప్పుడు మళ్లీ అదే బీజేపీ పంచన చేరిపోయారు. అంతకుముందు ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని గెలిచి మధ్యలో బీజేపీవైపు వెళ్లిపోయారు. అయితే పల్టీ కొట్టిన ప్రతిసారీ బీహార్ అభివృద్ధి కోసమే అనటం ఆయనకు ఆనవాయితీ. ఈసారీ అదే సెలవిచ్చారు.
ఎన్ని పల్టీలు కొట్టినా సీఎం కుర్చీని, తన పార్టీని కాపాడుకుంటూ రావడం నితీశ్ ప్రత్యేకత. అలవోకగా అంగి మార్చినంత, కరచాలనం చేసినంత సులభంగా పొత్తులు మార్చడం ఆయనకే చెల్లింది. ఇలాంటివి ఎన్ని చేసినా ఆయన పలుకుబడి చెక్కుచెదరకపోవడం విశేషం. మతోన్మాదం వంటి అంశాలపై ఉత్తర, దక్షిణ ధ్రువాల్లాంటి పార్టీలతో వంతులవారీగా అంటకాగడం కూడా ఆయనకే చెల్లింది. ఇంతకూ నితీశ్ ఉన్నపళంగా పల్టీ ఎందుకు కొట్టినట్టు? దీని గురించి రకరకాల వాదాలు వినిపిస్తున్నాయి. ఆయన ఇండియా కూటమి కన్వీనర్ కాలేకపోయారు. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును మమతాబెనర్జీ ప్రతిపాదించడంతో అదీ అందకుండా పోయింది. ఇవి కొంతవరకు కూటమి మార్పునకు దారితీసి ఉండొచ్చు. అంతకన్నా ముఖ్యమైన కారణం మరొకటుందని అంటున్నారు. లుకలుకల ఇండియా కూటమి విజయావకాశాలు అంతకంతకూ సన్నగిల్లుతున్న సూచనలే ఆయనను ఎన్డీఏ వైపు నడిపించి ఉంటాయని బలంగా వినిపిస్తున్నది.
ఇక నితీశ్ తాజా పల్టీ ఇండియా కూటమికి చావుదెబ్బలాంటిదని చెప్పాలి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర బీహార్లో ప్రవేశించేందుకు ఒకరోజు ముందే నితీశ్ హడావుడిగా కూటమి మారారు. దీంతో జోడో యాత్రకు తోడో నేపథ్యంగా మారింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే ఇదే. బెంగాల్ సీఎం మమత తిరుగుబాటుతో ఈసరికే కొంత నష్టం జరిగింది. నితీశ్ చేయ్యివ్వడం కోలుకోలేని దెబ్బేనని చెప్పాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆయనతో చేతులు కలిపిందనేది బహిరంగ రహస్యమే. రెండు రాష్ర్టాల్లో కలిపి 82 పార్లమెంట్ స్థానాలున్నాయి. కేంద్రంలో ఎవరు అధికారం దక్కించుకోవాలన్నా అవి చాలా కీలకం. అందుకే నిన్నటిదాకా నితీశ్ను తిట్టినోళ్లు ఆయన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులుగా చేరిపోయారు. రాజకీయాల్లో వైరాలు, స్నేహాలూ ఏవీ శాశ్వతం కావన్న నానుడి దీంతో మరోసారి నిజమైంది.