బన్సీలాల్పేట్ : గుండెపోటు రావడంతో అతిపిన్న వయస్సులోనే ఓ వైద్యుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా నిజాంపేటకు చెందిన డాక్టర్ పూర్ణచంద్ర (28) బుధవారం చాతిలో నొప్పిగా ఉందని, గాంధీ దవాఖానకు వచ్చి, గ్యాస్ రిలీజ్ కావడానికి ఇంజక్షన్ తీసుకుని, పై అంతస్తులోని హాస్టల్ గదివైపు నడుచుకుంటూ వెళుతుండగా, మెట్ల వద్ద కుప్పకూలిపోయాడు.
సహచరులు వచ్చి చూసే సరికే అతడు మృతి చెందినట్టు గుర్తించారు. గుంటూరు జిల్లా, పెదకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పూర్ణ చంద్ర, నీట్ అర్హత పరీక్షలో పాసై హైద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజిలో చేరి పీజీ పూర్తి చేశాడు.
గాంధీ దవాఖాన సర్జరీ విభాగంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా ఏడాదిపాటు సేవలు అందించాడు. కరోనా సమయంలో ఎందరో రోగులకు మంచి వైద్య సేవలు అందించాడు. గాంధీ దవాఖాన సమీపంలోని పద్మారావునగర్లో రూమ్లో ఉంటూ స్పెషలైజేషన్ కోసం చదువుకుంటున్నాడు.
మరో నెల రోజుల్లో వివాహ నిశ్చితార్థం ఉన్నదని స్నేహితులను ఆహ్వానించిన డాక్టర్ పూర్ణచంద్ర, అకస్మాత్తుగా మృతి చెందడం తోటి డాక్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. పెళ్ళి ఎంగేజ్మెంట్కు స్వగ్రామం వెళ్ళాల్సిన స్నేహితులు అతడి మృతదేహంతో ఆంబులెన్స్లో వెళ్ళాల్సిరావడంతో వారు కంటతడి పెట్టారు.
గాంధీ దవాఖానలోనే పనిచేసి, తోటి జూనియర్లతో ఎంతో సౌమ్యంగా ఉండి, అందరితో కలుపుగోలుగా వ్యవహరించిన పిన్న వయస్సుగల డాక్టర్ అందరి సమక్షంలోనే కన్నుమూయడం, తాము కాపాడుకోలేకపోవడం పట్ల పీజీలు ఆవేదన వ్యక్తం చేశారు.
అతడి మరణవార్త తెలియగానే దవాఖానకు వచ్చిన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, ఆర్ఎంఓలు, పలు విభాగాల వైద్యులు పూర్ణ చంద్ర మృతదేహానికి నివాళిలర్పించారు. ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన యువ డాక్టర్ను కోల్పోవడం పట్ల వారు తమ సంతాపాన్ని తెలిపారు.
నగరంలో నివసించే అతడి బంధువులు, సహచర వైద్య విద్యార్థులు కలిసి పూర్ణ చంద్ర మృతదేహాన్ని అంత్యక్రియల కోసం గుంటూరులోని అతడి స్వగ్రామానికి తీసుకెళ్ళారు.