మాదాపూర్ : మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే రుణ సంస్థల నుండి సులభంగా రుణాలు పొందే వెలుసుబాటు కల్పించాలని, అటువంటప్పుడే మహిళలు స్వయం ఉపాధితో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
మంగళవారం మాదాపూర్లోని హెచ్ఐసిసిలో టీసిఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ) ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి అవార్డ్ 2021 కార్యక్రమానికి ఎమ్మెల్సీ వాణిదేవి, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మీతా సబర్వాల్, ఫాగ్సి అధ్యక్షురాలు డాక్టర్ ఎస్. శాంతకుమారి, వీ హబ్ చీఫ్ దీప్తీ రావుల, కమిషనర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ, నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … ఒక మహిళకు అవార్డును ఇచ్చామంటే ఆ మహిళను ఆదర్శంగా తీసుకునే పిల్లలకు, కుటుంబానికి కూడా అవార్డు ఇచ్చి ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు. వాడవాడలా బతుకమ్మ పండగను ఘనంగా జరుపుతూ స్త్రీ ని దేవతగా పూజించే పవిత్రమైన నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్త్రీ శక్తి అవార్డులను అందజేయడం సంతోషకరమన్నారు.
దేశవ్యాప్తంగా దాదాపు ఆరు కోట్ల మంది పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కేవలం 15శాతం మాత్రమే మహిళల బాగస్వామ్యంతో నడుస్తున్నట్లు చెప్పారు. 80 శాతం మంది మహిళలు సొంతంగా వ్యాపారాలను నిర్వహిస్తుండగా 20 శాతం మంది ప్రైవేట్, ప్రభుత్వ ఆర్థిక సహయంతో పరిశ్రమలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టిన మహిళలు ఔత్సాహిక మహిళలకు చేయూతగా నిలవాలన్నారు.
పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలనుకునే మహిళలకు, యువతకు అన్ని రకాలుగా సలహలు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మహిళలకు అన్ని విధాల అండగా నిలిచినట్లయితే మరిన్ని పరిశ్రమలను నెలకోల్పేందుకు మహిళలు ముందుకు వస్తారన్నారు. అంతర్జాతీయ గైనకాలజిస్టుల అసోసియేషన్కు కార్యదర్శిగా ఎంపికైన తెలుగు మహిళ డాక్టర్ శాంతకుమారిని ఆమె అభినందించారు.
అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి స్మీతా సబర్వాల్ మాట్లాడుతూ … బతుకమ్మ పండగ తెలంగాణ సంప్రదాయాలు ఉట్టిపడే పండగ మాత్రమే కాదని మహిళ శక్తిని తెలియజేసే పండగ అని అన్నారు. ఈవెంట్ పరిశ్రమలో 30 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారని, పలు ఈవేంట్లలో సృజనాత్మకత ఉందంటే మహిళల ద్వారానే వస్తుందన్నారు. 30 శాతం మంది మహిళలు సరైన గుర్తింపుకు నోచుకోలేకపోతున్నట్లు చెప్పారు.
ఈవెంట్లలో మహిళలకు సరైన గుర్తింపునిచ్చేందుకు అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు టీసిఈఐ అధ్యక్షురాలు రాకీ కంకారియా తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మహిళలతో బతుకమ్మ సంబురాల్లో పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా స్త్రీ మూర్తి, స్త్రీ శక్తి, స్త్రీ రత్న పేరిట మూడు క్యాటగిరీల్లో 40 మంది మహిళలకు అవార్డులను అందజేశారు. అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేసి సందర్శకులను ఆకట్టుకున్నారు.