మాదాపూర్: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీలో తెలంగాణ మహిళ సంక్షేమ సంఘం ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … మహిళలు స్వయం కృషితో తమ కాళ్ళపై తాము నిలబడి ఆర్థికంగా ఎదిగి ఇతరులకు ఉపాది కల్పించే దిశగా అడుగులు వేయాలన్నారు. మహిళలు ఉన్నతమైన లక్ష్యం వైపు దృష్టి సారించాలన్నారు. నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా వ్యాపార, ఉద్యోగాల్లో సత్తా చాటుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మహిళలు కంప్యూటర్ శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్తో పాటు ఇతర రంగాల్లో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురుచూడకుండా స్వయంగా ఉపాధి కల్పించుకునే దిశగా అడుగులు వేయాలన్నారు. కుట్టు మిషన్ రంగంలో మహిళలు తమకున్న నైపుణ్యాన్ని జోడించి సరికొత్త అల్లికలు, డిజైన్లపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు యం. లక్ష్మీ, ఉపాద్యాక్షురాలు జె. భాగ్యలక్ష్మీ, గీత, దుర్గా, షియా భేగం, మెర్సీ కుమారి, మల్లమ్మలతో పాటు మాజీ వార్డు సభ్యురాలు రాణి, ఊర్మిల తదితరులు పాల్గొన్నారు.