బంజారాహిల్స్ : పేదలకు అండగా నిలవడంతో పాటు వారికి చేయూతనిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని 17మంది షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు మంగళవారం ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెక్కులను అందజేశారు.
లబ్దిదారులకు ఇంటికే వెళ్లి చెక్కులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్, శ్రీరాంనగర్ ప్రాంతాలలోని లబ్దిదారులకు చెక్కులు అందజేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, వారి కష్టాలను అర్థం చేసుకుని సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్దిలో దూసుకుపోతున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదే అన్నారు.