అబిడ్స్ : కట్టెలమండిలో నిర్మితమైన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో ఖాళీగా ఉన్న ఇండ్ల తాళాలు పగుటగొట్టి ప్రవేశించిన వారిపై పెట్టిన పోలీస్ కేసులను ఎత్తి వేయించాలని, ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానికులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు విజ్ఞప్తి చేశారు. కట్టెలమండి డబుల్ బెడ్రూం వాసులతో టీఆర్ఎస్ నాయకులు ఎం ఆనంద్కుమార్ గౌడ్ మంత్రిని ఆయన నివాసంలో కలిసి సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తాళాలు పగులగొట్టి ఇండ్లలోకి ప్రవేశించడం మంచి పద్దతి కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజలకు గౌరవప్రదమైన ఇండ్ల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. మిగిలిన ఇండ్లను కూడా నిజమైన లబ్దిదారులకు అందజేస్తామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్డీఓకు ఫోన్ చేసి మిగిలిన 25 ఇండ్ల విషయమై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇన్స్పెక్షన్ నిర్వహించి తనకు రిపోర్టు అందజేయాలని ఆదేశించారు.
అదే విధంగా పది మందిపై నమోదైన కేసుల విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ విషయాన్ని కూడా పరిష్క రిస్తామని హామీనిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు తీసుకు వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు ఎం ఆనంద్ కుమార్ గౌడ్కు బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు జీ. నందుకుమార్, ఎన్బీ కిరణ్, ఎం మహేష్, పి ప్రదీప్, పి సబితా, పి డాలి, వి బాబి, డి దేవేందర్, ఎస్ రాజు, పావని, వి సుమిత్ర పాల్గొన్నారు.