ఖమ్మం, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం విడుదల చేశారు. ఈ జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16లోపు సమర్పించాలని సూచించారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం తన కార్యాలయంలో సమావేశమై జాబితా విడుదల చేసి వారికి అందజేశారు.
ముసాయిదా జాబితా ప్రకారం.. జిల్లాలో మొత్తం 10,85,927 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 5,24,894 మంది, మహిళలు 5,60,973 మంది, థర్డ్ జెండర్లు 60 మంది ఉన్నారు. 1,33,004 మందిని (12.24 శాతం ఓటర్లు) అనామలీస్ (అసాధారణ ఓటర్లు)గా గుర్తించారు. 43,131 మంది (3.97 శాతం( ఓటర్లు మ్యాపింగ్ కానట్లు గుర్తించారు. మొత్తంగా 1,76,135 మంది ఓటర్లకు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నోటీసులు అందుకున్న వారు 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి అధికారులకు సమర్పించాల్సి ఉంది.
ఈ జాబితాలో పేరులేనివారు ఎన్నికల నమోదు అధికారులను సంప్రదించాలి. ప్రతి ఓటరూ తమ ఓటు హక్కు వివరాలను ceotelangana.nic.in అనే వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరులేనివారు, కొత్త ఓటర్లు ఫారమ్-6 ద్వారా సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు అవకాశాన్ని కల్పించారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఎస్డీసీ సదానందం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు రాజు, అన్సారీ, పార్టీల నాయకులు పాల్గొన్నారు.