కామారెడ్డి, ఆగస్టు 17 : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా కామారెడ్డిలో ఉద్రిక్తతకు దారి తీసింది. లింగంపేటలో చేపట్టిన ధర్నాకు వెళ్లకుండా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టు చేశారు.
విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు జాజాల ఇంటి వద్దకు చేరుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో జాజాల పోలీసుల నుంచి తప్పించుకొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఎదురుగా ఉన్న పాత జాతీయ రహదారి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్లకార్డు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ..బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో లేకపోయినా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అలాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
సంక్షేమ పథకాలంటే ఇష్టంలేని కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలురైన వ్యక్తులతో కోర్టులో కేసు వేయించిందని ఆరోపించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఆరు వారాల పాటు పథకాలను నిలిపివేసిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కోర్టులో కౌంటర్ దాఖలు చేసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.