జూబ్లీహిల్స్ : యూసుఫ్గూడ బస్తీలో సుదీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న కమ్యునిటీ హాలు ను ప్రజోపయోగంగా మార్చి బస్తీ దవాఖాన ఏర్పాటుచేస్తుంటే కన్నుకుట్టిన కబ్జాదారులు ప్రజల్లో అయోమయ పరిస్థితికి తెరలేపుతున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కబ్జాదారుల ఆటలు చెల్లవని, యూసుఫ్గూడలో ప్రారంభానికి సిద్దమైన బస్తీ దవాఖానకు కాంపౌండ్ వాల్ నిర్మాణంతో కబ్జా గ్యాంగ్ ఆటలకు చెక్ పెట్టనున్నామని వెల్లడించారు. గురువారం బస్తీ దవాఖాన ప్రాంగ ణంలో చేపడుతున్న కాంపౌడ్వాల్ నిర్మాణ పనులను కార్పొరేటర్ బండారి రాజ్కుమార్ పటేల్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ బస్తీ దవాఖాన ప్రాంగణంలో కొంత స్థలం వక్ఫ్ బోర్డు కు చెందినదిగా పేర్కొంటూ కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని పార్కింగ్ అవసరాలకు వినియోగించుకోవడమే కాక ప్రజల్లో అయోమయానికి తెరలేపుతున్నారన్నారు. యూసుఫ్గూడ బస్తీలో 15 ఏండ్ల క్రితం నగరపాలక సంస్థ కమ్యునిటీ హాలు నిర్మించిందని తెలిపారు.
దవాఖాన ప్రాంగణంలో జీహెచ్ఎంసీతో పాటు వక్ఫ్ బోర్డు స్థలముంటే అది ప్రజల ఆస్తికిందకే వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా దీనిపై కొన్ని మీడియాలలో కొంతమంది అసత్య ప్రచారాలకు దిగుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్గూడ బస్తీ దవాఖాన స్థలాన్ని కూడా కాపాడుతామని ఉద్ఘాటించారు. దురాక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.