మన్సూరాబాద్ : మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు బాధ్యత తీసుకుని టీఆర్ ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ లో నవంబర్ 15న నిర్వహించే విజయగర్జన సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని ఎంఆర్ డీసీ చైర్మన్ , ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు.
నవంబర్ 15న వరంగల్ లో నిర్వహించే విజయగర్జన మహాసభను పురస్కరించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి చేపట్టాల్సిన జన సమీకరణపై బుధవారం నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడలోని అనంతుల రాంరెడ్డిగార్డెన్ లో నిర్వహిం చిన నియోజకవర్గం టీఆర్ ఎస్ విస్త్రత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి 110 బస్సులు విజయగర్జనకు తరలి వెళ్లనున్నాయన్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా సభకు వస్తామని ఇప్పటికే తమకు తెలియజేశారని వారి కోసం అదనంగా మరికొన్ని బస్సులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సభకు వచ్చే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు భోజన వసతి కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కమిటీలలో స్థానం దక్కని వారు ఎలాంటి అసంతృప్తి చెంద వద్దని.. వారికి తగిన సమయంలో సరైన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన తెలిపారు.
అరవై లక్షల సభ్యత్వాలు కలిగిన ఇంత పెద్ద పార్టీలో ప్రతిఒక్కరికి ఒకే సమయంలో పదవులు దక్కడం కష్టమని ఓపికతో వేచి చూసే వారికి సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని ఆయన తెలిపారు. ఇరవై సంవత్సరాల క్రితం టీఆర్ ఎస్ పార్టీని ఏర్పాటు చేసి అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ అదే తరహాలో తనదైన శైలిలో పాలన సాగిస్తూ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, ఆసరా ఫించన్లు, దళితబందు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను తమ రాష్ట్రంలోను ప్రవేశపెట్టాలని ఇటీవల కర్నాటకలోని రాయచూర్ లో జరిగిన ఓ సమావేశంలో మంత్రులను ఎమ్మెల్యే కోరారని తెలిపారు.
దేశంలో బీజేపీ అరాచక పాలన కొనసాగిస్తుందని సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వాల హయంలోనే దేశంలోని ప్రజలతో పాటు సైనికులపై ఉగ్రదాడులు జరిగాయని తెలిపారు. పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచడం వలన నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.
నాగోల్ డివిజన్ టీఆర్ ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ , టీఎస్ఐఐసీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, చెరుకు సంగీత, జిట్టా రాజశేఖర్ రెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, రమావత్ పద్మానాయక్ , భవానీ ప్రవీణ్ కుమార్ , సామ తిరుమల్ రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస రావు, వివిధ డివిజన్ల అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, శ్రీధర్ గౌడ్ , కె. అరవింద్ రెడ్డి, నాయకులు వజీర్ ప్రకాష్ గౌడ్ , గజ్జెల మధుసూదన్ రెడ్డి, మాధవరం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.