మియాపూర్ : రాష్ట్రంలో అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గ సమున్నాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపట్టినట్లు, రాబోయే రోజులలో ఈ పురోగతిని మరింతగా పరుగులు పెట్టిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నిధులతో పాటు మౌలిక వసతుల కల్పనలో తన పూర్తి తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు.
ఐటీకి వేదికైన నియోజకవర్గంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు ఒక్కొక్కరు ఒక్కో చెరువును దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలని ఆయన సూచించారు. బుధవారం మంత్రి కార్పొరేటర్లు, అధికారులతో హెచ్ఎండీఏ కార్యాలయంలో సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ కేటీఆర్కు సాదర స్వాగతం పలికారు.
సమీక్ష సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ తమ నియోజకవర్గం ప్రపంచ వ్యాప్త మానవాళికి నివాస, ఉద్యోగ వేదికగా ఉన్నదని, ప్రజల సౌకర్యం కోసం అభివృద్ధిని మరింతగా పెంచాలని కోరారు.
నల్లగండ్ల ఎస్టీపీ మంజూరు, చెరువుల అభివృద్ధి,మోర్ సూపర్ మార్కెట్ రోడ్డు, ఉషాముళ్లపూడి రహదారి విస్తరణ, ఆపర్ణ నుంచి గంగారం ప్రధాన రహదారి వరకు రహదారి పనులు, శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్పూర్ వరకు రహదారి అభి వృద్ధి, మురళీధర్ రోడ్డు, నూతన రోడ్లు, లింక్ రోడ్లు, నెట్ వర్క్ లేని ప్రాంతాలకు తాగునీటి పైప్లైన్ విస్తరణ, స్మశాన వాటికల అభివృద్ధి, ఆస్బెస్టాస్ కాలనీ సీవరేజీ సెస్ మాఫీ, నాలాల విస్తరణ అభివృద్ధి అంశాలను సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన మంత్రి నియోజవకర్గ అదనపు అభివృద్ధికి కావలసిన నూతన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ కాలనీకి తాగునీటిని అందిస్తామని ,ప్రతీ డివిజన్లో అత్యవసర పనుల నిమిత్తం రూ. 2 కోట్ల మేర ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. చెరువుల్లోకి శుద్ధ జలాలు చేరేలా ఎస్టీపీల నిర్మాణాన్ని చేపడుతున్నామని, నియోజకవర్గంలో 7 చెరువులలో నిర్మిస్తున్నామన్నారు.
ప్రతీ డివిజన్లో వైకుంఠ ధామాలను తీర్చిదిద్దాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. విప్ గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై భరోసా ఇచ్చిన మంత్రి కేటీఆర్కు ప్రజాప్రతినిధులు, ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా అధికారుల పనితీరుపట్ల మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్కుమార్, మేయర్ విజయలక్ష్మీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, కమీషనర్ లోకేష్కుమార్, శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ అల ప్రియాంక, కూకట్పల్లి జడ్సీ మమత, డీసీ వెంకన్న , కార్పొరేటర్లు హమీద్పటేల్, రాగం నాగేందర్యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేశ్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత గౌడ్, సింధు ఆదర్శ్రెడ్డి, మాధవరం రోజాదేవి, కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు
ఇంకా జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్, సీఈ దేవానంద్, సీసీపీ దేవేందర్రెడ్డి, ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, జలమండలి డైరెక్టర్ స్వామి, సీజీఎం విజయరావు, జీఎం రాజశేఖర్,ఎస్ఈ శంకర్నాయక్, సీపీ నర్సింహరాములు, ఈఈలు శ్రీనివాస్, శ్రీకాంతిలు పాల్గొన్నారు.