మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం నుంచి మూడ్రోజులపాటు మహిళా బంధు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మార్గనిర్దేశకంలో యాదాద్రిభువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఓవైపు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూనే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టడంతోపాటు పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల లీడర్లు, ప్రతిభావంతులైన విద్యార్థినులకు సన్మానం చేయనున్నారు. మరోవైపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీఓస్, టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మహిళా ఉద్యోగులకు
నిర్వహించిన ఆటల పోటీల్లో కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొని ఉత్సాహం నింపారు.
సూర్యాపేట, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ ఎత్తున సంబురాలు చేపట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి నుంచి నేటి వరకు మహిళల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారుల వివరాలతో మంత్రి జగదీశ్రెడ్డి తయారు చేయించిన కరపత్రాలను ఈ మూడు రోజులపాటు ప్రతి మహిళ చేతికి అందించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు కొనసాగే సంబురాల్లో తొలి రోజు అయిన ఆదివారం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టడం, పారిశుధ్య కార్మికులు, వైద్యులు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను సన్మానించనున్నారు. రెండో రోజు(7న) కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను వారి ఇండ్ల వద్ద కలిసి ప్రభుత్వ పరంగా చేకూరిన లబ్ధిపై కరపత్రాలు అందించి సెల్ఫీలు తీసుకోనున్నారు. మూడో రోజు(8న) ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మహిళలతో సమావేశాలు నిర్వహిస్తారు. టీఆర్ఎస్ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల అధ్యక్షులు రవీంద్రకుమార్, బడుగుల లింగయ్యయాదవ్, కంచర్ల రామకృష్ణారెడ్డి ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. మూడు రోజులపాటు ప్రతి ఒక్కరూ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.