మైలార్దేవ్పల్లి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ అప్పా చెరువు, పల్లె చెరువులోకి భారీగా వరుద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రెండు చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. సరైన సమయంలో ఇరిగేషన్ అధికారులు స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. సంబంధిత అధికారులు సోమవారం రాత్రి నుంచి చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది రాత్రి నుండి శ్రమిస్తున్నారు.
అప్పాచెరువులో నీటి మట్టం పెరుగడంతో చెరువు కట్టపై అక్కడఅక్కడ కొద్దిగా గండి పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేపట్టారు. మరోవైపు చెరువు తూము ద్వారా నీటిని బయటకు వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయం చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రెడ్డి అప్పాచెరువు కట్టను సందర్శించారు. చెరువు కట్ట తెగకుండా తీసుకోవలసిన చర్యలపై ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్లు అప్పాచెరువు, పల్లె చెరువులను సందర్శించారు. చెరువు కట్ట పరిస్థితి గురించి ఆరా తీశారు.
గత ఏడాది అప్పాచెరువు నిండి కట్ట తెగడంతో 12 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. అప్పట్లో 5 కోట్లు వెచ్చించి అప్పా చెరువు కట్టను నిర్మించారు. అప్పా చెరువులోకి పైనుండి వచ్చే వరదతో చెరువు నిండకుండా వచ్చిన వరద నీటిని తూముల ద్వార బయటకు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. చెరువులోని నీటిని ఎప్పటికప్పుడు బయటకు వెళ్లాడానికి 8 కోట్ల 35 లక్షల ఎస్ఎన్డీపీ నిధులతో 5 మీటర్ల వెడల్పుతో బాక్స్ డ్రైన్ మంజూరు అయ్యిందని ఇరిగేషన్ అదికారులు వెల్లడించారు. వర్షాకాలం పూర్తయ్యాక పనులు మొదలు పెట్టే యోచనలో హెచ్ఎండీఏ ఉన్నదని అధికారులు తెలిపారు.
అప్పా చెరువులోకి వచ్చిన వర్షపు నీటిని ప్రేమావతిపేట్ పెద్దచెరువులోకి, అక్కడ నుండి మూసీనదిలోకి వెళ్లే విధంగా డ్రైన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అప్పా చెరువు ప్రస్తుతం పటిష్టంగానే ఉందని ఎప్పటికప్పుడు కట్ట పరిస్థితిని పరిశీలిస్తున్నామని అన్నారు. చెరువు కింద ఉన్న ఇండ్లలోని ప్రజలను అప్రమత్తం చేశారు. గత ఏడాది జరిగిన సంఘటన పునారావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సబితా ఇంద్రారెడ్డి అదేశించారు. డివిజన్లోని చెరువుల విస్తీర్ణం తగ్గి ప్రమాదకరంగా మారడానికి కారణం ఎఫ్ టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడమేనని స్థానికులు ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నారు.
దీంతో వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేయాలని వారు అధికారులకు ఆదేశించారు. అప్పాచెరువును సైబరాబాద్ కమీషనర్ స్టీఫేన్ రవీంద్ర శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి, ఏసీపీలు సంజయ్కుమార్ , వి భాస్కర్లు సందర్శించి చెరువులోని నీటిని బయట వెళ్లే మార్గం గురించి ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.సందర్శించిన వారిలో రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ,సర్కిల్ డీసీ జగన్, ఈఈ , ఏఈలు పాల్గొన్నారు.