బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో వృద్దురాలు అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసం ఉంటున్న నూకెళ్ల సూర్యవతి(80) గత నెల 29న పింఛన్ తెచ్చుకునేందుకు తనవెంట రావాలంటూ మనవడు రాకేష్ను కోరింది.
తనకు అర్జెంట్ పని ఉందని చెప్పిన రాకేష్ పనికి వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురయిన సూర్యవతి ఒంటరిగానే ఎస్ఆర్నగర్లోని పెన్షన్ ఆఫీసుకు వెళ్లింది. పెన్షన్ తీసుకున్న తర్వాత వీడియోగల్లీలో ఉన్న మరో మనవడు రమేష్ షాపువద్దకు వచ్చిన సూర్యవతి రూ.1000 ఇచ్చి అతడి తల్లికి ఇవ్వాలని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయింది.
అప్పటినుంచి కనిపించకుండా పోయిన సూర్యవతి ఆచూకీ కోసం అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో కుమార్తె నక్కా పద్మ బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.