బంజారాహిల్స్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20ఏండ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 25న ప్లీనరీని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో సమావేశమయిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పలు సూచనలు అందించారు.
ప్లీనరీనాడు దారిపొడువునా స్వాగత వేదికలు ఏర్పాటు చేయడంతో పాటు ధూంధాం కార్యక్రమాలు, బంజారా నృత్యాలతో స్వాగత కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. అక్టోబర్ 27న నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించ నున్నామన్నారు. ఇటీవల నియమితులైన బస్తీ బూత్ కమిటీలు, డివిజన్ కమిటీల సభ్యులందరూ సమావేశానికి హాజరుకావాలని సూచించారు.
నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న బహిరంగసభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్, వనం సంగీతయాదవ్తో పాటు వివిద డివిజన్లకు చెందిన అధ్యక్షులు కోనేరు అజయ్కుమార్, సంజీవ, సంతోష్, మన్సూర్, అప్పుఖాన్ తదితరులు పాల్గొన్నారు.