బంజారాహిల్స్ : ఫిలింనగర్లో నిర్మించతలపెట్టిన అభయాంజనేయ స్వామి ఆలయ నిర్వాహణ బాధ్యతలను ఫిలింనగర్ బస్తీవాసులకే అప్పగించాలని, లేని పక్షంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉంచాలని పలు బస్తీలకు చెందిన నాయకులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను కోరారు. సోమవారం టీఆర్ఎస్ సీనియర్నేత మామిడి నర్సింగరావుతో పాటు 18బస్తీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే దానం నాగేందర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రాలు అందజేశారు.
ఇటీవల రామానాయుడు స్టూడియో కింద రెడ్ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ కు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని అదేచోట నిర్మించేందుకు 2వేల గజాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా ఆలయ ట్రస్ట్ బాధ్యతలను వీహెచ్పీ, భజరంగ్ దళ్తో పాటు ఆలయాన్ని కాపాడాలంటూ పోరాడిన పల్లపు గోవర్దన్కు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణంతో పాటు నిర్వహణను ఫిలింనగర్ బస్తీలకు చెందిన వారికే అప్పగించాలని, బయటి వ్యక్తులకు ట్రస్ట్లో అవకాశం ఇవ్వవద్దని, అవసరమైతే దేవాదాయశాఖ ఆధీనంలో ఉంచాలని కోరుతూ అన్ని బస్తీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే దానంకు వినతిపత్రాలు అందజేశారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, ఆలయంతో పాటు కల్యాణమండపం కట్టిస్తామని పేర్కొన్నారు. గుడిచుట్టూ రాజకీయాలు చేయవద్దని, అన్ని వివాదాలను పరిష్కరించుకుందామని సూచించారు.