బంజారాహిల్స్ : పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ఎజెండాగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశించారు. టీఆర్ఎస్ డివిజన్ కమిటీల ఏర్పాటుతో పాటు బస్తీ అనుబంధ కమిటీల ఏర్పాటుకు సంబంధించి కార్యకర్తలతో బుధవారం తన నివాసంలో సమావేశ మయిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. బస్తీల్లో సమస్యలను ఎప్పటికప్పుడే పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన డివిజన్ కమిటీలు. బస్తీకమిటీలతో పాటు బస్తీ అనుబంద కమిటీ సభ్యులతో నెలనెలా తాను సమావేశం నిర్వహిస్తానని, ఏ సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బస్తీల్లో అభివృద్ది కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఇన్చార్జిలను నియమించి మానిటర్ చేస్తానని పేర్కొన్నారు. చేసిన అభివృద్దిని చెప్పుకోవడంతో పాటు చేయబోయే పనులను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంలో టీఆర్ఎస్ కార్యకర్తలు మరింత చురుగ్గా ఉండాలని సూచించారు. రెండురోజుల్లో బస్తీ అనుబంద కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని, పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిద డివిజన్లకు చెందిన సీనియర్ నేతలు పాల్గొన్నారు.