ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లోని బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అర్హులైన 16 మంది షాదిముబారక్, 13 కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల ఆర్థిక స్థితి గతులను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని దళిత బంధు, రైతుబంధు, బీమా, ఆసరా పథకాలు తీసుకువచ్చారని, గతంలో రూ. 200 ఉన్న వృద్ధాప్య పింఛను రూ.2వేల కు పెంచారని, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు రూ.3వేల చొప్పున అందచేస్తున్నారని, అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్లరేషన్ కార్డుల ఇచ్చి ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ సన్నబియ్యం ఇస్తున్నారన్నారు. రాష్ట్ర బంగారు తెలంగాణగా విరాజిల్లుతుంటే ఇతర పార్టీలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాయని, వాటిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మ రన్నారు. బడుగు బలహనీవర్గాలు, పేదల ప్రజల పక్షపాతిగా వారి సంక్షేమానికి నిత్యం పాటుపడుతున్నారన్నారు.
గణపతి నిమజ్జనోత్సవాల విషయంలో రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేకత ఉందని, సాగర్లో నిమజ్జనం చేయడం ఓ సెంటిమెంట్గా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిప్యూ పిటీషన్ వేయగా, ఈ సారి నిమజ్జనాలకు అనుమతిని ఇవ్వడం హర్షనీయమన్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయంగా బేబీ పాండ్స్ను ఏర్పాటు చేసిందని, తాజా సుప్రీం తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు గజ్జెల అజయ్, నాయకులు వైల ప్రవీణ్ కుమార్, మహేందర్ బాబు, గజ్జెల ఆనంద్, కరాటే రమేశ్, కిశోర్ కుమార్ పాల్గొన్నారు.