బంజారాహిల్స్ : పేదింటి ఆడపిల్లలకు పెళ్లిచేయడానికి తల్లిదండ్రులు పడే కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో నుంచి వచ్చిందే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరయిన చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి బుధవారం ఇంటింటికీ వెళ్లి అందజేశారు. సింగాడకుంట, జహీరానగర్, గౌరీశంకర్కాలనీ, దేవరకొండ బస్తీ, షౌకత్నగర్ బస్తీల్లో బైక్ల మీద పర్యటిస్తూ చెక్కులు అందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ కవితారెడ్డికి ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఘన స్వాగతం పలికారు.
తమ ఇంటికే వచ్చి చెక్కులను అందించడంపై లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం పేదలకు నేరుగా చేరుతోందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల కళ్లలో ఆనందం కనబడుతోందన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందు చూపుతో రాష్ట్రంలో అనేక విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. తాజాగా ఫార్ములా -ఈ కూడా హైదరాబాద్లో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జావెద్, జహీరుద్దీన్, నవీద్ తదితరులు పాల్గొన్నారు.