బంజారాహిల్స్ : మహిళల రక్షణ విషయంలో దేశానికే ఆదర్శంగా అనేక చర్యలు తీసుకుంటున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతోందని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం 12లో ఏర్పాటు చేయతలపెట్టిన సఖీ కేంద్రం నిర్మాణ పనులను మంత్రి సత్యవతి రాథోడ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయగా దేశవ్యాప్తంగా కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సఖి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సఖి కేంద్రాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా పనిచేస్తున్నా యన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.40లక్షలు కేటాయించి నగరం నడిబొడ్డున మంచి స్థలంలో సఖి కేంద్రాన్ని నిర్మిస్తోందన్నారు.
మహిళల రక్షణ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన చర్యలను అధ్యయనం చేసేందుకు వివిద రాష్ట్రాలనుంచి ప్రతినిధులు వస్తుంటారని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళల రక్షణకు చేపట్టిన చర్యలు ప్రశంసలు అందుకుంటున్నా యన్నారు. గంజాయి సమస్యలు ఎక్కువ కావడాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి గంజాయిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.
ఆడపిల్లల పట్ల సమాజం వైఖరిలో మార్పు రావాలంటే తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆడపిల్లలపై నేరాలకు పాల్పడిన దోషులను పట్టుకుని శిక్షలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో మూడింట రెండువంతుల కెమెరాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయంటే భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలా ఉన్నాయో తెలుస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో సఖి కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించేందుకు నిధులు విడుదల చేయడంతో పాటు స్థలాలను కేటాయిస్తున్నామన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని సఖి కేంద్రాలకు సొంత భవనాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మహిళలపట్ల నేరాలు తగ్గించేలా,సరైన న్యాయసేవలు అందేలా సఖి కేంద్రాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శర్మన్, స్త్రీశిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్రావు. ఆర్అండ్బీ ఎస్ఈ పద్మనాభరావు తదితరులు పాల్గొన్నారు.