కందుకూరు: ప్రభుత్వ రంగ సంస్థ టీఎస్ ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కళాజాత బృందాలు విరివిగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా కందుకూరు మండలం గుమ్మడవెల్లిలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగా హైదరాబాదు, జోన్ టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు వెంకటేశ్వర్లు ఆదేశాలతో కళాజాత బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ ఆర్టీసీ అందిస్తున్న రాయితీలు, సౌకర్యాలు వివరిస్తున్నారు. విద్యార్థినీలకు10, విద్యార్థులకు 7వ తరగతి వరకు రాయితీతో కూడిన ఉచిత పాస్ సౌకర్యం కల్పిస్తున్నామని, దివ్యాంగులకు జర్నలిస్టులకు ఉచిత పాసులు అందిస్తున్నట్లు వివరిస్తున్నారు.
కార్గో పార్సిల్, కొరియర్ సేవలు అందిస్తూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకోసం డ్రైవింగ్ స్కూళ్లను అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నామని యువకులకు, హేవీ డ్రైవింగ్ శిక్షణను ఇస్తున్నట్లు ప్రధాన బస్ స్టాండ్లతో పాటు గ్రామాల్లోని ప్రధాన చౌరస్తాల్లో కళాజాత ద్వారా పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకవస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.