కవాడిగూడ : ఉచిత వైద్య శిబిరాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రపంచ ఫిజియోథెరఫీ డే ను పురస్కరించుకొని గురువారం ఇందిరాపార్కు చౌరస్తాలో డిజెబుల్ ఫౌండేషన్ ట్రస్ట్, రవి హీలియోస్ దవాఖాన సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సంస్థలు, ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు మానవతాదృక్పదంతో ముందుకు వచ్చి ప్రజలకు సేవలందించాలన్నారు. మురికివాడలు, బస్తీలలో నిరంతరం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
పక్షవాతం వచ్చిన వ్యాధిగ్రస్థులు త్వరగా కోలుకోవడానికి ఫిజియోథెరఫీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నిరం తరం వ్యాయామం, యోగా, ద్యానం చేయాలని ఆయన సూచించారు. ప్రజలు తమ ఆరోగ్యాల పట్ల శ్రద్ద వహించాలన్నా రు. ఈ కార్యక్రమంలో డిజెబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.