రవీంద్రభారతి : భారతరత్న, దివంగత మాజీ రాష్ట్రపతి డా.ఎపీజే అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం 90వ జయంతి, ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై మాట్లాడుతూ భారతరత్న , మాజీ రాష్ట్రపతి డా.ఎపీజే అబ్దుల్ కలాం నిరుపేద కుటుంబంలో జన్మించి దేశానికి గొప్ప శాస్త్రవేత్తగా,ఉపాధ్యాయుడిగా, రాష్ట్రపతిగా ఎన్నో సేవలు చేశారని ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.అబ్దుల్ కలాం తనకు వచ్చిన జీతాన్ని పేద విద్యార్థు ల చదువులకు వెచ్చించి చదువు చెప్పించే వారని, పేదల కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.
అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా పనిచేసినప్పుడు తను కేంద్ర మంత్రిగా పనిచేశానని ఆయన సామాన్య వ్యక్తిగానే ఉండేవారని అలాంటి మహానీయున్ని నేనేప్పుడు చూడలేదన్నారు. రాష్ట్రపతి పదవీ విరమణ తరువాత మళ్లీ ఉపాధ్యాయుడుగా కొన సాగి పేద పిల్లలకు చదువు చెబుతూ ఉపాధ్యాయుడిగానే మృతి చెందారని, కలాంను దేశం ఎప్పటికి మరువ దన్నారు.
అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు బహుమతులు, మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.