ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2021లో స్పోర్ట్స్ కోటా వర్తింపజేయాలని టీఆర్ఎస్వీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ బాల్కసుమన్కు టీఆర్ ఎస్వీ రాష్ట్ర నాయకుడు మిథున్ ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2018 వరకు నిర్వహించిన ఓయూసెట్లో స్పోర్ట్స్ కోటాను అమలు చేసేవారని గుర్తుచేశారు.
2019 నుంచి నిర్వహిస్తున్న సీపీజీఈటీలో మాత్రం స్పోర్ట్స్ కోటాను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలామంది క్రీడాకారులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. కేవలం కొన్ని ప్రొఫెషనల్ కోర్సులకు మాత్రమే వర్తింపజేసి, 76 కోర్సులకు వర్తింపజేయకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరింపజేయాలని కోరారు.