బెంగుళూరు: సంపద పంపిణీ అంశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ(Deve Gowda) తప్పుపట్టారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను తప్పుపట్టిన ఆయన.. అధికారంలోకి రాలేమని అనుకున్న పార్టీలే అలాంటి హామీలు ఇస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని తలకిందులుగా మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. వాళ్లు చేసిన వాగ్ధాలను చూస్తే, ఏది చేసైనా అధికారంలోకి రావాలన్న కాంక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు కనిపిస్తోందని దేవగౌడ తెలిపారు. ఉద్యమం చేయాలన్న కల కుంటున్నాడని, సంపద పంపిణీ గురించి రాహుల్ మాట్లాడుతూ.. ఇద్దరు మాజీ ప్రధానులను ఆయన అవమానించినట్లు దేవగౌడ తెలిపారు. మార్కెట్ సంస్కరణలు చేపట్టి, దేశ సంపదను ఆ ప్రధానులు పెంచారన్నారు. మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్.. దేశంలో ఆర్థిక సరళీకరణ తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆ ఇద్దరు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలను రాహుల్ గాంధీ రద్దు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు.