సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఆయా వార్డుల్లో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు తన కోటా నుంచి నిధులను కేటాయిస్తూ బోర్వెల్లు వేయించడం జరుగుతుందన్నారు.
ఈ మేరకు సోమవారం బోర్డు పరిధిలోని రెండో వార్డు రసూల్పురా సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద నూతన బోర్వెల్ పనులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కంటోన్మెంట్లో నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా ఎనిమిది వార్డుల్లో నీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నూతన బోర్వెల్లు వేయిస్తున్నామని, రానున్న వేసవి కాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఆదే విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో ఒక్కొక్కటిగా పేరుకుపోయిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
సీడీపీ నిధుల నుంచి ప్రభుత్వ బడులను పునరుద్ధరించే క్రమంలో సుమారు రూ.2 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. టాయ్లెట్ల నుంచి ఎలక్టికల్, ఫర్నిచర్ వంటి పనులు చేయించనున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, నివేదితా, రెండో వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ ధన్రాజ్, నర్సింహ, గౌస్, ఉస్మాన్, ప్రవీణ్, నరేశ్, బాల్రాజ్, రఫిక్, రాకేశ్, పరశురామ్, నజీర్, హైమత్, ఫిక్, ఆజామ్, అనిల్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.