అమీర్పేట్ : సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని అమీర్పేట్ డివిజన్లో రూ. 2.43 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్లు, సివరేజీ, మంచినీటి పైపులను నిర్మాణాలకు శంకుస్థాపనతో పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన నూతన పవర్బోర్ను ప్రారంభించారు.
డివిజన్ పరిధిలోని సుప్రభాత్నగర్లో 2.20 లక్షల వ్యయంతో చేపడుతున్న సివరేజీ లైన్ పనులు, బల్కంపేట బస్తీలో రూ. 18.90 లక్షల వ్యయంతో చేపడుతున్న వీడీసీసీ రోడ్డు పనులు, ఎస్ఆర్నగర్ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాలు సమీపంలోని సాయి మేన్షన్ రోడ్డులో రూ.18.50 లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు, బాపూనగర్ బస్తీలో రూ. 10.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సివరేజీ పైపులైను నిర్మాణ పనులు, బస్తీలో రూ.3.60 లక్షల వ్యయంతో మంచినీటి పైపులైను పనులకు కార్పొరేటర్ సరళతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బాపూనగర్ బస్తీలో సీవరేజీ, మంచినీటి పైపులైను నిర్మాణాలు పూర్తయిన వెంటనే వీడీసీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బల్కంపేటలో కోట్లాది నిధులతో నిర్మించిన వైట్ట్యాపింగ్ రోడ్లపై ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ను ఇంకా ప్రారంభించ లేదంటూ బస్తీ వాసులు మంత్రి తలసాని దృష్టికి తేగా.. వెంటనే ఇందుకు సంబంధించిన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, ఈఈ ఇందిర, జలమండలి జీఎం హరిశంకర్, ఏఎంవోహెచ్ డాక్టర్ బార్గవ్ నారాయణ, ఎలక్టికల్ డీఈ కిరణ్మయిలతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.