ఉస్మానియా యూనివర్సిటీ : గౌడ వృత్తిని కించపరిచేలా మాట్లాడిన టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయనకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామారావుగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని చిక్కడపల్లి కల్లుకాంపౌండ్ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
దేవతలు తాగిన సురామృతం కల్లును, కల్లు కాంపౌండ్లను అవమానిస్తూ గౌడ్ల మనోభావాలను కించపరిచిన రేవంత్ ను గౌడ్లు క్షమించబోరన్నారు. కల్లు వృత్తి కష్టాలు రేవంత్కు తెలుసా అని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ హయాంలో కల్లువృత్తిదారులను అవమానించి, నగరంలో కల్లుదుకాణాలు మూయించిన కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను గద్దె దించింది గౌడ్లేనన్న విషయం మరిచిపోకూడదన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గీతకార్మికుల హక్కులు, ఆత్మగౌరవం కాపాడుకుంటూ, కల్లు వృత్తితో ఉపాధి పొందుతున్న కల్లు కాంపౌండ్లను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. గతంలో కల్లువృత్తిని కించపరుస్తూ టీవీలలో అసభ్యంగా మాట్లాడిన జబర్ధస్త్ వేణుకు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు.
తక్షణమే రేవంత్రెడ్డి గౌడ్లకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. గత కాంగ్రెస్ పాలనలో బహుజన కులాలను అణగదొక్కితే, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు బీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌరవిస్తోందని కొనియాడారు. అధికార దాహంతో, మతిభ్రమించి మాట్లాడుతున్న రేవంత్ వైఖరిని రాష్ట్రంలోని బీసీలంతా గమనిస్తున్నారన్నారు.
ఆయన ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఆయనను రాష్ట్రంలో తిరగనీయబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైగౌడ్ ఉద్యమం జాతీయ నేతలు సీకా బాలరాజుగౌడ్, మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్, బొమ్మగాని శంకర్గౌడ్, రఘునాథ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.