మణికొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ స్పష్టం చేశారు.సోమవారం గండిపేట్ మండల తాసీల్ధార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రకాష్గౌడ్ విచ్చేశారు. గండిపేట్ మండలంలోని మణికొండ, గండిపేట్ , బండ్లగూడ, నార్సింగి ప్రాంతాలకు చెందిన 80 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను నెర వేర్చారని అన్నారు. ఆసరా ఫింఛన్ , రైతుల కోసం రైతు బంధు. రైతు భీమా, 24 గంటలు ఉచిత కరెంట్ , పేదల కోసం షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఆలోచించలేదు. ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా ఉండేది . కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటు వారి పిల్లల పెళ్లిళ్లకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
మహిళలు ఈ కళ్యాణ లక్ష్మి డబ్బులను వృథా చేయకుండా అవసరానికి తగ్గట్టు ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి కేసిఆర్కు, స్థానిక ఎమ్మెల్యే టిప్రకాష్గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో బండ్లగూడ మేయర్ మహేందర్గౌడ్ ,నార్సింగి చైర్మన్ రేఖాయాదగిరి, కౌన్సిలర్లు కె రామ క్రిష్ణరెడ్డి, పత్తి శ్రీకాంత్ , ప్రవీణ్కుమార్ , శివారెడ్డి, తహశీల్దార్ రాజశేఖర్, మాజీ ఎంపీపీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.