చాదర్ఘాట్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి పేద ప్రజలు, గర్భిణీ మహిళల కోసం ఇస్తున్న నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహార పదార్ధాలను సక్రమంగా అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం ముసరాంబాగ్లోని సంజీవయ్యనగర్ కాలనీలో అంగన్వాడీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి వస్తున్న నిత్యవసర వస్తువులు సక్రమంగా అందుతున్నాయా అని గర్భిణీ మహిళలను అడిగి తెలుసుకున్నారు. నిత్యవసర సరుకుల పట్టికను ఏర్పాటు చేయాలని, తప్పనిసరిగా ఫిర్యాదుల బాక్స్ను ప్రజలకు అందుబాటులో పెట్టాలని సీపీడీఓ, టీచర్ను ఆదేశించారు. నెలవారిగా సరుకుల పంపిణీకి సంబంధించిన బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్లో విజిటింగ్ రికార్డ్ ఏర్పాటు చేయాలన్నారు.
అంగన్వాడీ స్కూల్లోని గర్భిణీ మహిళలు ప్రభుత్వ దవాఖానాలలో మాత్రమే ప్రసవాలు జరిగే విధంగా చూడాలని ఆశా వర్కర్లను ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ స్కూల్ ల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.