ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం జలమండలి, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ వింగ్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ బండ్లగూడ చెరువు ప్రాంతంలో జీహెచ్ఎంసీ 70 మీటర్ల చిన్న డ్రైయిన్ లైన్ వేసిందని, ఇక్కడ సమగ్ర నాలా డెవలప్మెంట్ కార్యక్రమం కింద పనులు చేస్తున్నారని, ఈ పనులను ఇరు విభాగాలు సమన్వయంతో చేపడితే బాగుంటుందని అన్నారు.
డ్రైయిన్ పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని, ఎత్తు, పల్లాలను సరి చూసుకుని పనులు చేపట్టాలన్నారు. అక్కడ ఉన్న ఓ ప్రైవేటు స్థలం గూండా పైప్లైన్ వేస్తున్నామని, దానికి గాను సదరు వ్యక్తికి నష్టపరిహారం కూడా ఇప్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
చంద్రా గార్డెన్స్ నుండి మెగా ఫంక్షన్ హాల్ మీదుగా సరూర్నగర్ చెరువు వరకు, సరూర్నగర్ చెరువు నుండి కోదండరాంనగర్ మీదుగా చైతన్యపురి మూసీ నాలా బ్రిడ్జ్ వరకు సరూర్నగర్ ఇందిరా ప్రియదర్శినీ పార్కు నుండి సరూర్నగర్ డీ, జోనల్ కమీషనర్ కార్యాలయం మీదుగా చైతన్యపురి బ్రిడ్జ్ వరకు నూతన వరదనీటి కాలువ నిర్మాణ పనులు కూడా అతి త్వరలో మొదలుపెట్టాలని సూచించారు.
వచ్చే వర్షాకాలం నాటికి అన్ని వరదనీటి కాలువ పనులను పూర్తి చేసి రాబోయే వర్షాకాలంలో ప్రజలను వరదనీటి ముంపు నుండి విముక్తులను చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ ఉప కమిషనర్ మారుతీ దివాకర్, ఇరిగేషన్ ఎస్ఇ మురళీకృష్ణ, డిఇ పవన్, ఇఇ నారాయణ తదితరులు పాల్గొన్నారు.