మెహిదీపట్నం : ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ ఎ. ఉమ తెలిపిన వివరాల ప్రకారం….
గుడిమల్కాపూర్ బాలాజీనగర్లో నివసించే కిషోర్ కుమార్ (55) జియాగూడలో మెడికల్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మెడికల్ షాప్ మూసివేసి తన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు.
గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఇతడి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వేగంగా వెళ్లి పోయింది. తీవ్రగాయాలకు గురైన అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు .మంగళవారం ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కిషోర్కుమార్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.