సికింద్రాబాద్ : వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక విధానాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న విమర్శించారు. రాష్ట్రంలో వరిని పండిస్తున్న రైతులను నట్టేటా ముంచేలా కేంద్ర నిర్ణయాలు ఉన్నాయన్నారు.
దమ్ముంటే యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒప్పించాలని ఎమ్మెల్యే సాయన్న డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి తేకుంటే నియోజకవర్గంలో తిరుగనివ్వమని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో గురువారం కార్కానాలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా శుక్రవారం ధర్నాచౌక్లో చేపట్టనున్న ధర్నాను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లను కొనలేమని అంటుంటే బండి సంజయ్ మాత్రం వరి సాగుచేయాలంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత వానకాలం సీజన్కు సంబంధించి కొనుగోళ్లపై ఇప్పటిదాకా అనుమతి జారీ చేయలేదని తెలిపారు.
ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, వారికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చి కేంద్రం కుటిల ప్రేమను చూపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి రైతుల పక్షాన నిలబడుతున్నా రన్నారు. వారి కోసం రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రైతు వ్యతిరేక చట్టాలపై ఇప్పటికీ ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారన్నారు. కొత్త చట్టాల పేరుతో కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందని విమర్శలు గుప్పించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, దేవులపల్లి శ్రీనివాస్, మహంకాళి శర్విన్, తేజ్పాల్, మురళీయాదవ్, పనస సంతోష్, సరిత, నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.