మహేశ్వరం : మహేశ్వరానికి మణిహారంగా నిలిచేలా బై పాస్ రోడ్డు నిర్మాణ మ్యాప్ను సిద్దం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. బుధవారం నగరంలోని మంత్రి చాంబర్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో మహేశ్వరం అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం బై పాస్ రోడ్డు నిర్మాణంపై అంచనాలను తయారు చేయాలని వారిని కోరారు. దీనికోసం త్వరతిగతిన పూర్తి ప్రణాళిక రూపొందించాలని ఆమె ఆర్ఆండ్బీ అధికారులను ఆదేశించారు. మహేశ్వరాన్ని ఒక ప్రతిష్టాత్మక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
ఆర్ఆండ్బీ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్నుండి చౌరస్తా వరకు 3 కోట్ల 50 లక్షలతో జంక్షన్ అభివృద్ది పనులు, సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. 1కోటి 45 లక్షల రూపాయలతో మన్సాన్పల్లి చౌరస్తాను అభివృద్ది చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
మహేశ్వరం గేట్ నుండి మహేశ్వరం వరకు 5కోట్ల 40 లక్షలతో 4 లైన్ల రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులను చేపడుతున్నామని ఆమె అన్నారు. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు 15 రోజులల్లో పూర్తి చేసి పనులు ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎంపీపీ రఘుమారెడ్డి, తాసిల్దార్ ఆర్పీజ్యోతి, ఎంపీడీవో నర్సింలు, ఆర్ఆండ్బి డీఈ శ్రీనివాస్రెడ్డి, సీఐ మధుసూధన్ వివిద శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.