ఇటిక్యాల, జూన్ 9: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేసేందుకు కృషిచేయాలని జెడ్పీచైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం సూచించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయములో గురువారం ఎంపీపీ స్నేహ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో పలువురు ప్రజాప్రతినిధులు మిషన్ భగీరథ తాగునీరు సరిగ్గా రావడంలేదని, గ్రామాల్లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ సమస్యలు నెలకొంటున్నాయని సభలో ప్రస్తావించారు. ఈ విషయమై తాము జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం గ్రామాల్లో అమలవుతున్న పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొని జిల్లాకు మంచిపేరు తేవాలన్నారు. సభలో వివిధ శాఖల అధికారులు తమ శాఖలవారి నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హన్మంత్రెడ్డి, పుటాన్దొడ్డి పీఏసీసీఎస్ అధ్యక్షుడు రంగారెడ్డి, ఎంపీడీవో రాఘవ, ఎంఈవో రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అయిజ, జూన్ 9: పల్లెలు, పట్టణంలో పరిశుభ్ర వాతావరణం, పచ్చదనమే లక్ష్యంగా ప్రగతి పనులు చకచకా సాగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతిరోజూ ఊరూరా విస్తృతంగా పర్యటిస్తుండటంతో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. పల్లెలు, పట్టణంలో చెత్తాచెదారం తొలగించడం, మురుగు కాల్వలు, వీధులను శుభ్రం చేయడం, కాలనీల్లో విద్యుత్ స్తంభాలు వేయడంతోపాటు అవసరమైన చోట తీగలను ఏర్పాటు చేయడం, వీధిదీపాలను అమర్చడం వంటి పనులు చేపడుతున్నారు.
గ్రామ, పట్టణ అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ అధికారులు ప్రగతి లక్ష్యాన్ని వివరిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ 6 మొక్కల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు.
మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని వెల్లడిస్తున్నారు. గురువారం ఏడో రోజూ అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 18 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెలు, పటణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఉండవెల్లి, జూన్ 9: పల్లెప్రగతి పనుల్లో వేగం పెంచాలని అధికారులకు డీపీవో శ్యామ్సుందర్ ఆదేశించారు. మండలంలోని బైరాపురం, బస్వాపురం, ఉండవెల్లి, పుల్లూరులో నిర్వహిస్తున్న పలెప్రగతి కార్యక్రమాన్ని డీపీవో గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య ఉన్న ఫిర్యాదులు స్వీకరించి త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సంవృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున హరితహారం మొక్కలు సిద్ధం చేసి విరివిగా నాటాలన్నారు. అనంతరం గ్రామాల్లోని డంపిగ్యార్డులు, సెగ్రిగేషన్షెడ్డులు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, ఎంపీవో పద్మావతి, సర్పంచులు మల్లేశ్వరి, శివరామ్, రేఖావెంకట్గౌడ్, నారాయణమ్మ, పంచాయతీ కార్యదర్శులు కవిత, నాగరాజు, అశోక్కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.
అలంపూర్, జూన్ 9: పట్టణ ప్రగతిలో భాగంగా 7,8,9 వార్డుల్లో చేపడుతున్న పనులను ప్రత్యేక అధికారి శ్రీపాద రామేశ్వర్రావు గురువారం పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్, సూపర్వైజర్ షరీఫ్అహ్మద్, నారాయణ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్, జూన్ 9: మండలంలోని దాసరిపల్లిలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ భరత్కుమార్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సాంబశివుడు ఆధ్వర్యంలో గురువారం మురుగుకాల్వలను శుభ్రం చేశారు. కాలనీల్లో కంపచెట్లను జేసీబీతో తొలగించారు. పాడుబడ్డ ఇండ్లను తొలగించారు. మల్దకల్లో సర్పంచ్ యాకోబు ఆధ్వర్యంలో పాడుబడ్డ ఇండ్లను తొలగించే కార్యక్రమం నిర్వహించారు.
ధరూరు, జూన్9: పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జాంపల్లిలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని ప్రతిఇంటికీ ఆరు మొక్కలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గణపతి, ఏఎంసీ చైర్మన్ రాము, స్పెషల్ ఆఫీసర్ మాధురి, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.