మియాపూర్ : పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులంతా క్రమశిక్షణతో బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలలో అచెంచలమైన విశ్వాసం నెలకొని ఉన్నదని, అందుకు అనుగుణంగా నాయకులు పని చేయాలన్నారు.
శేరిలింగంపల్లి నియోవకవర్గం కూకట్పల్లి డివిజన్ టీఆర్ఎస్ కమిటీ, అనుబంధ, బస్తీ కమిటీలను కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ గురువారం తన నివాసంలో ప్రకటించారు. ఈ సందర్బంగా విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో గులాబీ జెండా ఎదురులేని శక్తిగా ఉన్నదని ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు , ప్రజల తరపున పార్టీ చేస్తున్న కృషే ఇందుకు కారణమన్నారు.
పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి ఎప్పటికయినా సరైన గుర్తింపు లభిస్తుందని, నిత్యం ప్రజల మధ్యే ఉండి పని చేసే నిజమైన శ్రేణులను గుర్తించి డివిజన్ కమిటీలు ఇతర బాధ్యతలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం నిత్యం కృషి చేయాలని తద్వారా పార్టీపై ప్రజలలో ఇంకా విశ్వాసం పెరుగుతుందన్నారు.
పార్టీ అధినేతల ఆదేశాల మేరకు వ్యవహరిస్తూ బాధ్యతతో పని చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలని విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సంజీవరెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, ఇ బ్రహీం లు పాల్గొన్నారు.