మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, సెప్టెంబర్ 13 : టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, 2001లో సీఎం కేసీఆర్ పార్టీని స్థాపించి గులాబీ జెండాను చేతపట్టుకొని యావత్తు తెలంగాణను ఏకం చేసి ఢిల్లీ నాయకుల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించి.. సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్స్లో జరిగిన మెదక్ పట్టణం, మెదక్, హవేళీఘణాపూర్ మండలాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుందామని, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కమిటీలను వేసుకుని ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎక్కడా పిలుపు ఇచ్చినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగామని గుర్తు చేశారు. గతంలో కరెంటు కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండేది. పంటలు పండిన తర్వాత గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పటి సీమాంధ్ర ప్రభుత్వాలు ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని కొనియాడారు. అంతేకాకుండా రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కొవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకున్నదన్నారు.
గతంలో ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లాలంటేనే భయపడేవారు.. తాగునీటి సమస్యతో రోడ్డెక్కిన మహిళలు కనబడేవారు.. ఇప్పుడు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు.
60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. రైతులను ఇబ్బందులు పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అలాగే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నదని ఆరోపించారు.
టీఆర్ఎస్ పార్టీలోనే సభ్యత్వాలు, కమిటీలు
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల పరిశీలకుడు రాధాకృష్ణశర్మ
సభ్యత్వాలు, కమిటీలు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల పరిశీలకుడు రాధాకృష్ణశర్మ అన్నారు. గడపగడపకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. మెదక్ నియోజకవర్గంలో 48వేల మందితో సభ్యత్వ నమోదు చేశామని, 80 శాతం కమిటీలను పూర్తి చేశామన్నారు. 50 శాతానికి మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని, కమిటీలో ప్రతి కార్యకర్తకూ అవకాశం ఇవ్వాలని అన్నారు.
పార్టీ పటిష్టత విషయంలో ఒక స్వచ్ఛమైన, నిర్దిష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని, కిందిస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలని అటు పార్టీని, ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. 20వ తేదీలోగా పట్టణ, మండల కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. మెదక్ జిల్లాలోని మెదక్ నియోజకవర్గంలో 90 శాతం, నర్సాపూర్ నియోజకవర్గంలో 90 శాతం కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ కార్యకర్తలకు అండగా ఉంటున్నారని, ఎవరైన కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారాన్ని చెల్లిస్తున్నారని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మెదక్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, హవేళీఘణాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యులు చింతల నర్సింలు, కిష్టయ్య, సుభాశ్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, మెదక్, మెదక్ మండలం, హవేళీఘణాపూర్ మండలాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.