మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలలో, కాలనీల్లో జాతీయ పతాకావిష్కరణలు చేపట్టారు.
కాగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మియాపూర్లోని క్యాంపు కార్యాలయంతో పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభసందర్భంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం రోజుల రాజ్యాంగం కల్పించిన హక్కులను పౌరహక్కులను వినియోగించుకుంటూ ప్రాథమిక విధులను సైతం బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు.
రాజ్యాంగాన్ని రచించిన మహనీయులను ఎప్పటికీ స్మరించుకోవాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. రాజ్యాంగం సూచించిన ప్రకారం సమానత్వం కోసం తమ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వారి స్ఫూర్తితో నియోజకవర్గంలోని ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్యాదవ్,.జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మంజులరెడ్డి, పూజిత గౌడ్, మియాపూర్ సీఐ తిరుపతిరావు, ట్రాఫిక్ సీఐ సుమన్ , పార్టీ నేతలు పాల్గొన్నారు.