రవీంద్రభారతి : గత ఇరవై సంవత్సరాలుగా కృషి కల్చరర్ ఆర్ట్ అకాడమీ వారు చేస్తున్న సేవలు అభినంద నీయమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో కృషి కల్చరర్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో కృషి కల్చరర్ ఆర్ట్ ద్విదశాబ్ది కళోత్సవాలు ఎంతో అంగరంగా వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం మేయర్ బంగి అనీల్కుమార్ విచ్చేశారు.
అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా కృషి కల్చరర్ ఆర్ట్ అకాడమీ వారు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. నిట్టూరి రాజరత్నం చేసిన సేవలను కొనియాడుతూ ఆయన కళారంగానికి ఎంతో సేవచేశారని ఆ సేవలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం సిద్ధించిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కళలకు, కళాకారులకు ఎంతో తోడ్పాటునందిస్తు న్నారని చెప్పారు. కవులను, కళకారులను గుర్తించి ప్రభుత్వం వారికి తగిన గుర్తింపునిచ్చి గౌరవిస్తుందన్నారు. అంతేకాకుండా అనేక మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించారన్నారు.
కవులు,కళాకారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాన్నారు. అనంతరం గత ఇరవై సంవత్సరాలుగా కళాసేవ చేస్తున్నటువంటి 20 మంది కళాకారులకు ఖుషీ పురస్కార్ అవార్డులను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు వివిధ రంగాలకు చెందిన కళానృత్యాలను ఎంతో అంగరంగ వైభవంగా ప్రదర్శించి ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు.ఈ కార్యక్రమంలో కాసిపాక రాజమౌళి, కనకం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.