ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ దేవాలయ బోనాలు ఆదివారం వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారికి రెండవ భోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ దంపతులు హాజరై అమ్మవారిని దర్శనం చేసుకోని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బోనాలు ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఆలయాల వద్ద సౌకర్యాలకోసం నిధులు కేటాయించడంతో పాటు బోనాల ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పండుగలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్, నాయకులు మారోజు రామాచారి, పెంబర్తి శ్రీనివాస్, యాదవరెడ్డి, సిద్దగోని వెంకటేష్గౌడ్, గిరినందన్గౌడ్ తదితరులు ఉన్నారు.