బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ కో అపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్పై పాలకమండలిలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం హైడ్రామా మధ్య ఆమోదం పొందింది. పాలకమండలిలో విభేదాలతో కార్యదర్శి మురళీముకుంద్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు శుక్రవారం జూబ్లీహిల్స్లోని సొసైటీ కార్యాలయంలో పాలకమండలి సభ్యులు సమావేశమయ్యారు. సహకారశాఖ రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఉదయం 11.30కి సమావేశం ఏర్పాటు చేశారు.
కాగా తనపై నిభంధనలకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఏర్పాటు చేసిన సమావేశాన్ని నిలిపివేయాలంటూ సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్ హైకోర్టులోని ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. సరిగ్గా సమావేశం ప్రారంభమవడానికి ఏడు నిమిషాల ముందు సమావేశాన్ని మూడురోజుల పాటు ఆపాలంటూ తీర్పు వచ్చింది. అయితే తీర్పు విషయాన్ని ప్రస్తావించకుండా రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 12మంది సభ్యులు ఓటు వేయడంతో సొసైటీ కార్యదర్శిగా మురళీ ముకుంద్ను తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా తెలంగాణ సహకారశాఖ నిభంధనల ప్రకారం మూడేళ్ల పాటు పాలకమండలి సభ్యుడిని తొలగించేందుకు అధికారం లేదని, బైలాస్ను ఉల్లంగించడంతో పాటు కొంతమంది ఒత్తిళ్లతో కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా అవిశ్వాస తీర్మానానికి అనుమతించిన రిజిస్ట్రార్ మీద కోర్టు దిక్కరణ కేసు వేస్తామని సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్ తెలిపారు.